అవార్డ్స్ అందుకోగల పారిశ్రామిక వేత్తలని జైలు పాలు చేసింది తమరి ప్రతిభే కదా: నాగబాబు

  • ట్విట్టర్ లో నాగబాబు, విజయసాయి మధ్య విమర్శల దాడి
  • పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చిందన్న విజయసాయి
  • భగ్గుమన్న నాగబాబు
  • గొట్టంగాడు అంటూ వ్యాఖ్యలు
ట్విట్టర్ లో మెగాబ్రదర్ నాగబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చిందని, సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలేసిన వాళ్లకు రాజకీయాలెందుకు? అంటూ విజయసాయి చేసిన ట్వీట్ కు నాగబాబు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తాము సాధారణమైన వ్యక్తులం అని, తాము సినిమాలు, టీవీ షోలు చేయకపోతే కుటుంబాలను పోషించుకోలేమని తెలిపారు.

"అయినా మీకు ఆ అవసరం లేదు లెండి, మంది సొమ్ము బాగా మెక్కారు కదా. ఇంకో 1000 ఏళ్లు కాలుమీద కాలువేసుకుని హాయిగా దొంగ లెక్కలు వేసుకుంటూ బతికగలరని మాకు తెలుసు. అవార్డులు అందుకోగల పారిశ్రామికవేత్తలను జైలు పాలుచేసింది తమరి ప్రతిభే కదా. మీరు వైఎస్సార్ ఆడిటర్ కాకపోయి ఉంటే శతకోటి గొట్టంగాళ్లలో ఒక గొట్టంగాడని వదిలేసేవాడ్ని. ఈ కరోనా టైమ్ లో నీలాంటి గొట్టంగాళ్లు నాతో ట్వీట్ చేసే బదులు, భవిష్యత్తులో ఏ జైల్లో ఎలా టైమ్ పాస్ చేయాలో ఇప్పటినుంచే ఒక షెడ్యూల్ తయారుచేసుకోవాలి... టైమ్ కలిసొస్తుంది" అంటూ ఎద్దేవా చేశారు.

Nagababu
Vijayasai Reddy
Twitter
Janasena
YSRCP
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News